Tuesday, July 21, 2009

prp dadulu


దాడులు చేసుకున్న పిఆర్‌పి నాయకులు, కార్యకర్తలు
-రసాబాసాగా ముగిసిన మధిర నియోజకవర్గ స్థాయి సమావేశం
-జిల్లా కన్వీనర్‌ పదవికి లక్కినినేని రఘు కార్యకర్తలు
మధిర అర్భన్‌ (ఖమ్మం జిల్లా)
ప్రాజారాజ్యం పార్టీ మధిర నియోజకవర్గస్థాయి సమావేశం రసాబాసాగా సాగింది. నాయకులు, కార్యకర్తలు కలిసి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఈ సమావేశానికి వచ్చిన పరిశీలకులు, జిల్లా నాయకులు మధ్యలోనే వెళ్లిపోవ అర్ధంతరంగా ముగిసింది. మంగళవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ కన్వీనర్‌ పోకల కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత మండల పరిదిలోని అల్లీనగరం గ్రామానికి చెందిన పవన్‌ కళ్యాణ్‌ అభిమాని రేళ్ళ రామకృష్ణ సంతాపం ప్రకటించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు గౌతం మాట్లాడుతూ పార్టీ ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తలు కుంగిపోవాల్సిన పనిలేదన్నారు. అనంతరం పార్టీ ఓటమి గల కారణాలను తెలపాలని నాయకులు, కార్యకర్తలు కోరారు. ఈ క్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ పోకల కృష్ణ మాట్లాడుతూ జిల్లా కన్వీనర్‌ ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా పర్యటించలేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్వీనర్‌ పదవికి రఘు అర్హుడు కాదన్నారు. అదే విధంగా పార్టీ అభ్యర్థికి మెండెం జయరాజు, చెరుకూరి శేషగిరిరావు, శీలం చెన్నారెడ్డి తదితరులు సహకరించలేదని విమర్శించారు. దీంతో జయరాజు స్పందిస్తూ అభ్యర్ధే తమని కలుపుకొని పోలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా జిల్లా కన్వీనర్‌, నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి అమ్ముడుపోయారని అందుకే జిల్లాలో ఒక్కసీటు గెలవలేదని దుయ్యబట్టారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానై అసభ్య పదజాలంతో దూషించుకుంటూ కుర్చీలతో దాడి చేసుకున్నారు. చివరికి ఎవరు ఎవరిపై దాడి చేస్తారో అర్ధంకాని నేపద్యంలో రాష్ట్ర పరిశీలకులు, జిల్లా నాయకులు సమావేశం హాలు నుండి బయటకు వెళ్ళిపోయారు. రాష్ట్ర పరిశీలకులు గౌతం, జిల్లా కన్వీనర్‌ లక్కినేని రఘుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడమే కాకుండా అసభ్య పదజాలాలతో దూషించుకొని ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకోవడంతో ప్రజారాజ్యం పార్టీ నియోజవకర్గం సమావేశంలో అసంతృప్తిగా మధ్యలోనే అసంతృప్తిగా ఆగిపోయింది. ఎన్నికల అనంతరం తొలిసారిగా నిర్వహించిన ఈ సమావేశంలో అసంతృప్తితో ఉన్న ఆ పార్టీలోని రెండు వర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ వర్గ విభేదాలు భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
రోజురోజుకూ ముదురుతున్న వరి విత్తనాల గొడవ
వైరా
వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఈ ఖరీఫ్‌ కోసం రైతులకు అమ్మిన బిపిటి 5204 పౌండేషన్‌ వరి విత్తనం మొలకెత్తక రైతులు లబోదిబోమంటున్నారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ అయిన వైరా కృషి విజ్ఞాన కేంద్రం వరి పరిశోధనా కేంద్రంలో పండించిన పౌండేషన్‌ సీడ్‌ను 30 కేజీలు రూ.585లకు విక్రయించారు. జిల్లా వ్యాపితంగా వరి విత్తనం కోసం తరలివచ్చిన వందల మంది రైతులకు ఒక్కొక్కరికి 30 కేజీల బస్తా ఒక్కొక్కటి విక్రయించారు. పౌండేషన్‌ సీడని, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పండించి తయారు చేసిన విత్తనం మేలైందని నమ్మిన రైతులు విత్తనం కోసం ఎగబడ్డారు. రైతుల ఒత్తిడి పెరిగిపోవడంతో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పోలీసుల బందోబస్తు మధ్య సుమారు 90 క్వింటాల విత్తనాలను విక్రయించారు. ఈ విత్తనం చల్లిన రైతులు మొలకెత్తలేదని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను కలవగా వాతావరణాన్ని చూసుకుని విత్తనం చల్లాలని, ప్రస్తుతం తాము చల్లి పెంచుతున్న నారుమళ్లను పరిశీలించి రాండని ఉచిత సలహాలిస్తున్నారు. బ్రాహ్మణపల్లి, సోమవరం, స్టేజి పినపాక, గన్నవరం, ఖానాపురం, విప్పలమడక రైతులు కృషి విజ్ఞాన కేంద్రానికిరాగా అధికారుల నుండి సరైన సమాధానం లేదు. వరికోత సమయంలో ఆలస్యమై బాగా తూలిపోయి, గింజ పునరుత్పత్తి శక్తిని కోల్పోయిందని, విత్తన శుద్ధి కూడా జరగలేదని రైతులు విమర్శిస్తున్నారు. గట్టిగా నిలదీసిన రైతులకు జెజిఎల్‌ రకం విత్తనం అందజేసి కళ్లనీళ్లు తుడుస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.